
మంత్రి పొంగులేటి చొరవ.. కిడ్నీ బాధితుడికి రూ. 9 లక్షల ఎల్వోసీ
పొన్నెకల్ గ్రామ శాఖ నాయకుల విన్నపంపై స్పందించిన మంత్రి
తుంబూరు దయాకర్ రెడ్డి సమన్వయంతో త్వరితగతిన సాయం మంజూరు
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం/పొన్నెకల్ : నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టంగా భావించే తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
అత్యవసర వైద్య చికిత్స కోసం ఎదురుచూస్తున్న ఒక నిరుపేదకు ప్రభుత్వ ఎల్వోసీ మంజూరు చేయించి కొండంత భరోసా ఇచ్చారు.
వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామానికి చెందిన కత్రం సిద్దు అనే వ్యక్తి రెండు కిడ్నీలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సుమారు రూ. 9 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ నిరుపేద కుటుంబం ఆవేదనలో మునిగిపోయింది. ఈ క్రమంలో పొన్నెకల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు బాధితుడి పరిస్థితిని గమనించి అండగా నిలిచారు.
పొంగులేటి దృష్టికి తీసుకెళ్లిన దయాకర్ రెడ్డి
గ్రామ నాయకులు బాధితుడిని తీసుకుని ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్-చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ని కలిశారు.
దయాకర్ రెడ్డి బాధితుడి ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందులను వెంటనే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, ప్రభుత్వపరంగా ఎల్వోసీ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
త్వరితగతిన 9 లక్షల ఎల్వోసీ మంజూరు
మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవతో, యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 9 లక్షల ఎల్వోసీ మంజూరైంది.
కష్టకాలంలో ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద మొత్తంలో సాయం అందేలా చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బాధితుడు సిద్దు, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ప్రక్రియను పర్యవేక్షించిన తుంబూరు దయాకర్ రెడ్డికి, వెన్నంటి నిలిచిన పొన్నెకల్ గ్రామ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.




