MuluguPoliticalTelangana

కర్రెగుట్టల్లో ఐఈడీ బాంబు పేలుడు....

కర్రెగుట్టల్లో ఐఈడీ బాంబు పేలుడు....

కర్రెగుట్టల్లో ఐఈడీ బాంబు పేలుడు….

Web desc : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భీభత్సం చోటుచేసుకుంది.

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట సమీపంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న ఒక సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు, జెల్లా గ్రామాల మధ్య కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో భద్రతా చర్యల్లో భాగంగా 39వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ (CRPF) బృందాలు శుక్రవారం ఉదయం నుంచే కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టులు పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని భూమిలో అమర్చిన మందుపాతరలను వెతికే క్రమంలో అధికారులకు ఏకంగా 11 ఐఈడీ బాంబులు లభ్యమయ్యాయి.

సకాలంలో వీటిని గుర్తించిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వాటిని సురక్షితంగా నిర్వీర్యం చేయగలిగింది. అయితే, దురదృష్టవశాత్తు మరో బాంబును వెలికితీసే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది.

వరుసగా 11 బాంబులను నిర్వీర్యం చేసిన అనంతరం, 12వ ఐఈడీని గుర్తించి దానిని డిఫ్యూజ్ చేసే ప్రయత్నంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ భారీ పేలుడు ధాటికి నవజీత్ అనే జవాన్‌ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది.

వెంటనే అప్రమత్తమైన తోటి జవాన్లు క్షతగాత్రుడిని అడవి నుంచి బయటకు తీసుకువచ్చి, ప్రాథమిక చికిత్స నిమిత్తం వెంకటాపురానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి జవాన్ నవజీత్‌ను హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌లోని ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button