
హోలీ వేళ ఆకతాయిల అల్లరి చేష్టలు
హోలీ పండుగ వివిధ రకాల రంగులు చల్లుకొని వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కానీ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో హోలీ వేడుకల్లో భాగంగా అకతాయిలు రంగులు వాడకుండా డ్రైనేజీ లోని మురుగునీరు ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులపై, డ్రైవర్ కండక్టర్ లపై చల్లుతూ వీరంగం సృష్టించారు. దీంతో ప్రయాణికులు ప్రజలు ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
నారాయణపేట ఆర్టీసీ డిపో నుండి మంగళవారం గద్వాలకు వెళుతున్న బస్సు చెక్ పోస్ట్ సమీపంలోకి రాగానే ఈ సంఘటన చోటు చేసుకోవడం విస్మయానికి గురిచేస్తుంది. ఆకతాయిలు బస్సులోకి మురుగునీరు చల్లడంతో ప్రయాణికుల దుస్తులపై పడడంతో దుర్గంధ భరిత వాసన వెదజల్లింది.
దీంతో చేసేది ఏమీ లేక కండక్టర్ డ్రైవర్లతో పాటు ప్రయాణికులు సమీపంలో ఉన్న కుళాయి వద్ద బట్టలు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వేడుకలు వేడుకగా జరుపుకోకుండా అకతాయిలు చేసిన పనులకు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. బస్సు గంటపాటు ఆలస్యమైందని డ్రైవర్ ఇమ్మానుయేల్ ,కండక్టర్ కార్తీక్ తెలిపారు.
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో ఊట్కూర్ లో మాత్రం కొంత మంది అకతాయిలు చేసిన అల్లరి పనులకు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.




