
పటాన్ చెరువులో దారుణ హత్య… దుండగులను వెంటనే అరెస్టు చేయాలి: బోడ రమేష్ నాయక్
మహబూబాబాద్ : హైదరాబాద్లోని పటాన్ చెరువు ప్రాంతంలో భార్యాభర్తలు హత్యకు గురైన ఘటనపై దుండగులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు.
శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మానుకోట జిల్లా పెద్ద గూడూరు మండలం గుండెంగా గన్యాచక్రు తండాకు చెందిన ధరావత్ సోము, మంగమ్మ దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్లోని పటాన్ చెరువులో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజులాగే శుక్రవారం రాత్రి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన అనంతరం ఆ దంపతులు ఇంట్లోనే హత్యకు గురయ్యారని చెప్పారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి హత్యకు గల కారణాలను వెలికితీసి, నిందితులను గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే హత్యకు గురైన కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అలాగే ఇందిరమ్మ ఇల్లు (డబుల్ బెడ్రూమ్) కేటాయించి గిరిజన లంబాడి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



