
కానిస్టేబుల్ను కిరాతకంగా నరికి చంపిన దుండగులు.. ఉప్పల్లో హై టెన్షన్!
వరుస హత్యలతో భాగ్యనగరం వణికిపోతున్న క్రమంలో తాజాగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి హత్య నగరవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆదివారం చిల్కానగర్ సాయిబాబా గుడి వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది.
నలుగురు గుర్తు తెలియని దుండగులు సుధీర్ రెడ్డిని అడ్డగించి, అందరూ చూస్తుండగానే కత్తులతో కిరాతకంగా నరికి చంపారు. రక్తపు మడుగులో పడి ఉన్న కానిస్టేబుల్ను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
పట్టపగలే రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక రక్షణ అధికారి పైనే ఇంతటి తెగింపుతో దాడి జరగడం శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోంది. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న సుధీర్ రెడ్డి పై పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణ హత్య జరిగి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం అందుతోంది.
నిందితులు పక్కా ప్లాన్తో సుధీర్ను వెంబడించి వేటాడి చంపినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు.
నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘోరం తో ఉప్పల్, చిల్కానగర్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


