
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. బడ్జెట్ ప్రతులను చింపిపారేసిన ప్రతిపక్ష సభ్యులు
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మండిపడింది.బడ్జెట్ను నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు బడ్జెట్ ప్రతులను చింపిపారేశారు.
అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. దాంతో అసెంబ్లీలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్కు నిరసనగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే.. బీఆర్ఎస్ సభ్యులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రజలను ‘చెవిలో పూలు’ పెట్టి మోసం చేస్తోందంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ చెవుల్లో పూలు పెట్టుకుని సభ నుంచి బయటికి వచ్చారు.
ముందుగా బడ్జెట్ ప్రసంగం మొదలవగానే.. ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు.
ముఖ్యంగా ‘ఆరు గ్యారంటీల’ అమలు తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం సభ నుంచి బయటికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎంట్రీ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
‘తులం బంగారం మోసం మోసం’ అని నినాదాలు చేస్తూ ప్రభుత్వం పేద మహిళలను వంచించిందని విమర్శించారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు మోసం మోసం’ అని నినదిస్తూ యువతకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు.
ఇక ‘బడ్జెట్ మోసం మోసం’ అని నినాదాలు చేస్తూ ఈ బడ్జెట్లో పేదలకు, రైతులకు, మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.



