
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ చార్జిషీట్.. ఏ1 గా కేటీఆర్
Social media viral : ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అభియోగాలు మోపుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది.
ఏ2గా మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఏ4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థలను చేర్చింది. హెచ్ఎండీఏ బోర్డుకు చెందిన రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్టు పేర్కొంది.
దాదాపు 1000కి పైగా డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు అందించింది. కాగా, ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీటును కోర్టు పరిశీలిస్తోంది. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం విచారణకు స్వీకరించనుంది.
కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు మాజీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఏఎస్ అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే.
జీఏడీ నుంచి అనుమతి లభించిన క్రమంలో కేటీఆర్, అర్వింద్ కుమార్తో పాటు కేసులో మూడో నిందితుడైన హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బి.లక్ష్మీ నర్సింహారెడ్డి (బీఎల్ఎన్రెడ్డి), గ్రీన్కో ఏస్ నెక్స్ట్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను నిందితులుగా చేరుస్తూ అభియోగాలతో చార్జ్షీటు దాఖలు చేశారు.
హెచ్ఎండీఏ నిధులు రూ.54.89 కోట్లు విదేశీ కంపెనీకి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కి చెందిన రూ.54.89 కోట్ల నిధులు విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండీఏ నిధుల దుర్వియోగంపై ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ దానకిశోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మరుసటి రోజే డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా.. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా, అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అర్వింద్ కుమార్ను రెండో నిందితుడిగా, బి.లక్ష్మీనర్సింహ్మారెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది.
ఈ ముగ్గురితో పాటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఆర్గనైజర్ గ్రీన్కో ఏస్ నెక్స్ట్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. ఏసీబీ సేకరించిన ఆధారాలతో పాటు అప్పటి ఎమ్ఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ప్రధానంగా కేటీఆర్ పేరును ప్రస్తావించారు.
నిందితుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలతో చార్జిషీట్ .
కేటీఆర్ ఆదేశాల మేరకే తాను నిర్ణయాలు తీసుకున్నట్టు అర్వింద్ కుమార్ వాంగ్మూలాలు ఇచ్చారు. ఇదే అంశాన్ని కేటీఆర్ కూడా ఏసీబీ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.
ప్రధానంగా ఈవెంట్ నిర్వహణ కోసం స్పాన్సర్ ఫీజు, ట్యాక్స్లు కలిపి మొత్తం రూ.110 కోట్లు (గ్రేట్ బ్రిటన్ పౌండ్ 90,00,000) చెల్లించే విధంగా అగ్రిమెంట్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్, సివిల్ వర్క్స్ కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేసేలా అండర్ టేకింగ్ తీసుకున్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది.
వీటితో పాటు హెచ్ఎండీఏ బోర్డు నిధుల నుంచి రూ.160 కోట్లు అప్రూవల్ ఒప్పందం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో లండన్కు రూ.45.71 కోట్ల తరలింపు, హెచ్ఎండీఏకి రూ.8.07 కోట్లు ఐటీ జరిమానా సహా మొత్తం రూ.54.88 కోట్ల నిధులు దుర్వినియోగంపై ఏసీబీ అభియోగాలు మోపింది. దీంతోపాటు ఈ కార్ -రేసింగ్ వల్ల హెచ్ఎండీఏకు ఎలాంటి లాభం లేకపోగా.. రూ.75.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ఏసీబీ ఆధారాలు సేకరించింది.
ఈ మొత్తం వ్యవహారంలో గ్రీన్ కో సంస్థ నుంచి క్విడ్ ప్రోకో రూపంలో రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్కు వచ్చినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. వీటికి సంబంధించిన పూర్తి సాంకేతి ఆధారాలతో కూడిన చార్జిషీటు దాఖలు చేసేంది.



