
ఆత్మహత్యాయత్నం చేసిన డాక్టర్ కుటుంబం.. అసలేం జరిగిందంటే..
Web desc : పల్నాడు జిల్లా నరసరావుపేటలో కుటుంబం మెుత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. నాదెండ్ల మండలం సాతులూరుగా చెందిన ఓ డాక్టర్ కుటుంబం ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడింది. ఏం కష్టమెుచ్చిందో తెలియదు కానీ మూడేళ్ల చిన్నారితో సహా భార్యాభర్తలిద్దరూ బలవన్మరణానికి యత్నించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన డాక్టర్ గోపి కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో నివాసం ఉంటోంది. భోపాల్ ఎయిమ్స్ ఆస్పత్రిలో గోపి డాక్టర్గా అతని భార్య శంకర కుమారి నర్సుగా పని చేస్తున్నారు.
వారికి మూడేళ్ల చిన్నారి మౌనిక ఉంది. బాధిత కుటుంబం నిన్న(శనివారం) రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకి వచ్చింది. వారంతా దినేశ్ గ్రాండ్ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ ఘటనలో శంకర కుమారి, చిన్నారి మౌనిక మృతిచెందారు. గోపి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు..
గోపిని వెంటనే నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ గదిని నిశితంగా పరిశీలించారు. మత్తు ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలను సైతం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికులను కన్నీటిపర్యంతం చేసింది. అయితే, కుటుంబం మెుత్తం ఆత్మహత్యాయత్నం చేసుకునేంత కష్టం ఏం వచ్చిందా? అని పోలీసులు, స్థానికులు చర్చించుకుంటున్నారు.



