
కల్వకుంట్ల కవిత అరెస్ట్.. రైతులకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట!
వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల పోరాటం ఉగ్రరూపం దాల్చింది.
పోలీసులు, రైతులకు మధ్య జరిగిన తోపులాటతో పరిస్థితి ఒక్కసారిగా రణరంగంగా మారింది.దీంతో రైతులకు మద్దతుగా పరిగి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పరిగి ప్రాంతంలో పరిశ్రమల స్థాపన కోసం తమ సారవంతమైన భూములను లాక్కోవద్దంటూ రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
ఈ పోరాటానికి అండగా నిలిచిన కవిత, బుధవారం వందలాది మంది రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు భారీగా మోహరించి రైతులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత మొదలైంది.
ఎన్టీఆర్ చౌరస్తా వద్ద హైడ్రామా.. ధర్నా నిర్వహిస్తున్న కవితను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, రైతులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గంటల తరబడి తోపులాట జరిగింది.
పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు కవితను బలవంతంగా వాహనం నుంచి కిందకు దించి, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా తరలించారు. ఆమె వాహనాన్ని కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అరెస్టుకు ముందు కవిత మాట్లాడుతూ.. “రైతుల పొట్ట కొట్టి పరిశ్రమలు కట్టడం ఏంటని?” ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతులు ప్రాణాలకు తెగించి తమ భూములను కాపాడుకుంటుంటే, వారిపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం కవిత అరెస్టుతో వికారాబాద్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎక్కడికక్కడ జాగృతి శ్రేణులు రాస్తారోకోలు చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా కేంద్రంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.



