
ఇంటర్ లో ఫెయిల్ అయిందని మనస్తాపంతో యువతి ఆత్మ*హత్య
కారేపల్లి : ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిన కారణంగా యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
కారేపల్లి ఎస్సై బైరు గోపి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మేకల తండా-దుబ్బ తండా గ్రామానికి చెందిన గుగులోత్ సంజన (17) కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర నిరాశకు లోనైన ఆమె ఇంట్లో ఉన్న ఎలుకల మందు సేవించింది.
విషయం ఇంట్లో చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆలస్యంగా తెలుసుకొని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఈ నెల 19న రాత్రి 10 గంటలకు ఆమె మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా, గ్రామంలో విషాద ఛాయలు నెలకొంది.
కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఎస్సై బైరు గోపి మాట్లాడుతూ పరీక్షల్లో అపజయంతో జీవితం అంతం కాదని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు మానసిక బలాన్నిచ్చి, ప్రోత్సహించాలని అన్నారు.
విద్యార్థులు కూడా ఒత్తిడిని జయించి ముందుకు సాగాలని తెలిపారు. ఒక చిన్న నిరాశ కారణంగా జీవితాన్ని కోల్పోవడం మంచిది కాదన్నారు. జీవితానికి విలువ ఇచ్చే ఆలోచనలతో ముందుకు సాగాలని అన్నారు.



