
మద్యం మత్తులో లొల్లి.. వ్యక్తి దారుణ హ*త్య
చేగుంట : కల్లు దుకాణం వద్ద జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఈ సంఘటన మసాయిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మాసాయిపేట గ్రామానికి చెందిన గుడ్డి దశరథ (45)సోమవారం రాత్రి కల్లు తాగేందుకు దుకాణానికి వెళ్లాడు.
అదే సమయంలో అక్కడే ఉన్న వడ్డే శ్రీకాంత్ మద్యం మత్తులో అల్లరి చేస్తూ సీసాలు పగులగొడుతుండగా, దశరథ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి ఆగ్రహానికి లోనైన శ్రీకాంత్ సీసాతో దశరథ తలపై బలంగా దాడి చేశాడు.
తీవ్ర గాయాల కారణంగా దశరథ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన పై కేసునమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.




