
చెకింగ్ అధికారిపై చెప్పుతో దాడి.. కండక్టర్పై కేసు నమోదు
సంగారెడ్డి : మహిళా ఉచిత బస్సు సౌకర్యంలో జీరో ఏంహెచ్ సీ టికెట్ ఇచ్చి ప్రయాణికుడి నుంచి రూ.20 వసూలు చేసిన కండక్టర్కు చార్జి మెమో ఇస్తుండగా.. టిటిఐపై చెప్పుతో దాడి చేసినట్లు రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్ తెలిపారు.
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడమే కాకుండా, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయాణికులను రెచ్చగొట్టి దాడికి పాల్పడిన కండక్టర్ దేవ్సోత్ వసంత్పై కఠినమైన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
అసలు ఏం జరిగిందంటే..? శుక్రవారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో, TGSRTC హెడ్ క్వార్టర్స్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ పెడ్డదొడ్డి యేసయ్య ఇన్-ఛార్జ్ టీటీఐ, వీప్రకాష్ టీటీఐలు తన బృందంతో కలిసి జహీరాబాద్ – నారాయణఖేడ్ మార్గంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఝరాసంగం మండలం కప్పడ్ గ్రామ సమీపంలో నారాయణఖేడ్ డిపోకు చెందిన బస్సు (నెం. TG15-Z-0082)ను తనిఖీ చేశారు.
ఆ సమయంలో కండక్టర్ ఒక ప్రయాణికుడి వద్ద నుండి రూ.20 నగదు తీసుకున్నప్పటికీ, అతనికి టికెట్ జారీ చేయనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తనిఖీ అధికారులు, నిబంధనల ప్రకారం కండక్టర్కు ‘ఛార్జ్ మెమో’ జారీ చేసేందుకు సిద్ధమయ్యారు.
అయితే, ఆ కండక్టర్ దేవ్సోత్ వసంత్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అధికారులను విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, బస్సులోని ప్రయాణికులను అధికారులపైకి రెచ్చగొట్టాడు. అంతటితో ఆగకుండా తన కాలి చెప్పుతో అధికారులపై దాడికి తెగబడ్డాడు.
అధికారుల నుంచి రికార్డులను (Charge Memo & MTD 353 Book) లాక్కొని దౌర్జనానికి దిగాడు. ఈ దాడిలో టీటీఐ ఇన్-ఛార్జ్ యేసయ్య ఎడమ చేతి వేలికి గాయం కాగా, మరో అధికారి వీప్రకాష్ నుదుటిపై తీవ్రమైన గాయాలయ్యాయి.
పోలీసులకు ఫిర్యాదు.. ఈ ఘటనపై బాధిత చెకింగ్ అధికారి యేసయ్య రాయికోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు క్రైమ్ నంబర్ 46/2026 కింద కేసు నమోదు చేశారు.
భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 121(1) (ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉండగా అడ్డుకోవడం, గాయపరచడం) కింద కండక్టర్ దేవ్సోత్ వసంత్, దాడిలో పాల్గొన్న ప్రయాణికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారులను తప్పుదోవ పట్టించేలా కండక్టర్ వ్యవహరించిన తీరుపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
సిబ్బందిపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవు: ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి
ఈ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందిస్తూ, సంస్థలో సిబ్బంది క్రమశిక్షణారాహిత్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కేవలం టికెట్ లేని ప్రయాణికుడి కేసు నుండి తప్పించుకోవడానికి అధికారులపై దాడి చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.
విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై ఇటువంటి దాడులకు పాల్పడితే చట్టపరంగా శిక్షలు తప్పవని, ఉద్యోగులందరూ సహృద్భావ వాతావరణంలో పనిచేయాలని ఆయన సూచించారు.



