
‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై దుమారం.. మంత్రి కొండా సురేఖపై బీజేపీ ఫైర్
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ‘జై శ్రీరామ్’ నినాదంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ..’బీజేపీ నేతలకు జై శ్రీరామ్ అనడమే పనైపోయిందని, ఆ నినాదంతో పైసలు రాలుతున్నాయా? పథకాలు వస్తున్నాయా?’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది.
‘ఆమె దేవాదాయ శాఖ మంత్రి కాదు.. దైవద్రోహ శాఖ మంత్రి’ అని అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ధ్వజమెత్తింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ నాయకులు హిందువుల మనోభావాలపై విషం చిమ్ముతున్నారని మండిపడింది.
దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన సురేఖకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. శ్రీరాముడిని అపహాస్యం చేసిన మంత్రి తక్షణమే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీ బీజేపీ డిమాండ్ చేసింది.




