
కూసుమంచి డీసీసీబీ బ్యాంక్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సీఈఓ
డిపాజిట్ల పెంపుపై ప్రత్యేక దృష్టి
గోల్డ్ లోన్ల ప్రచారానికి ఉద్యోగులకు సూచనలు
కల్లూరుగూడెం సొసైటీ పనితీరుపై సమీక్ష
రైతులకు మరింత మెరుగైన సేవలందించాలని ఆదేశించారు.
కూసుమంచి, జూన్ 4:
కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీసీసీబీ శాఖను బ్యాంకు సీఈఓ ఆదిత్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు వ్యాపారాభివృద్ధి, డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు, ఖాతాదారులకు అందిస్తున్న సేవలు, నగదు లావాదేవీల వివరాలను సమీక్షించారు.అనంతరం బ్యాంకు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో సీఈఓ ఆదిత్య మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధికి డిపాజిట్లే ప్రధాన బలమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామీణ ప్రాంత ప్రజలను బ్యాంకింగ్ సేవల వైపు ఆకర్షించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.బ్యాంకు ద్వారా అందిస్తున్న బంగారం ఆభరణాల రుణాలు గోల్డ్ లోన్స్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఈ సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఖాతాదారులు గోల్డ్ లోన్లను సద్వినియోగం చేసుకునేలా బ్యాంకు సిబ్బంది చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే డిజిటల్ బ్యాంకింగ్ సేవల వినియోగాన్ని పెంచి ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.అనంతరం సీఈఓ కల్లూరుగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ)ని సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ సూపర్వైజర్ కొంగర వేణు, సొసైటీ ఇన్చార్జి శేఖర్ తో సమావేశమై సొసైటీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. రైతులకు అందిస్తున్న పంట రుణాలు, ఎరువులు, విత్తనాల సరఫరా, రుణాల రికవరీ, సభ్యుల నమోదు, డిపాజిట్ల సేకరణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.సహకార సంఘాలు గ్రామీణ రైతాంగానికి వెన్నెముకలాంటివని, రైతులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చూడాలని సూచించారు. రుణాల పంపిణీలో పారదర్శకత పాటించడంతో పాటు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సొసైటీ వ్యాపారాభివృద్ధి, సభ్యుల సంఖ్య పెంపు, ఆర్థిక లావాదేవీల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సహకార వ్యవస్థ బలోపేతానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీఈఓ పేర్కొన్నారు. ఈ తనిఖీలో బ్యాంకు అధికారులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.




