
వర్షాన్ని లెక్కచేయని ఎమ్మెల్యే పర్యటన
మన్పహాడ్లో రూ.30 లక్షల పనులకు శంకుస్థాపన
పాలకుర్తి,సి కే న్యూస్ : దేవరుప్పుల మండలంలోని మన్పహాడ్ గ్రామంలో కురుస్తున్న జోరు వానను సైతం లెక్కచేయకుండా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి తన పర్యటనను కొనసాగిస్తూ రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సైడ్ డ్రెయిన్ మరియు మహిళా భవనం నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళల సాధికారత కోసం మహిళా భవనాల నిర్మాణం, గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కురుస్తున్న జోరు వానను కూడా లెక్కచేయకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పర్యటనను కొనసాగిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తుందని, పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావెర అనిల్ కుమార్ , సర్పంచ్ పారుపల్లి బాలమ్మ శ్రీనివాస్, యాకయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




