
మాలల న్యాయ పోరాట సభ పోస్టర్ ఆవిష్కరణ
మాల విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ జూలై 31 2026: మాల విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల సాధన లక్ష్యంగా నిర్వహించనున్న “మాలల న్యాయ పోరాట సభ” పోస్టర్ను ప్రముఖ హైకోర్టు న్యాయవాది పల్లా రాజశేఖర్, అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లింగాల రవి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఎడ్యుకేట్స్ అసోసియేషన్ ఫర్ మాల కన్వీనర్ దాసరి రమేష్, కో-కన్వీనర్ శెట్టి కమలాకర్, మాలల న్యాయ పోరాట సభ అధ్యక్షుడు మంచాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్లా రాజశేఖర్ మాట్లాడుతూ, మాల విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న తెలంగాణ ఎడ్యుకేట్స్ అసోసియేషన్ ఫర్ మాల ప్రతినిధులను అభినందించారు. ఎస్సీ ఉపవర్గీకరణ, రోస్టర్ విధానం అమలుతో మాల విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మాల సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
మాలల న్యాయ పోరాట సభ అధ్యక్షుడు మంచాల నాగరాజు మాట్లాడుతూ, శనివారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్తలింగాలలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించే మాలల న్యాయ పోరాట సభకు రాజకీయ పార్టీలకు, వివిధ సంఘాలకు అతీతంగా మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.




