
తాగి నడిపితే.. జైలు గడపే దారి
డ్రంకెన్ డ్రైవ్కు కోర్టు కఠిన తీర్పు
75 మందిపై కొరడా.. ఒకరికి జైలు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 01 2026: మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల ఫలితంగా నమోదు చేసిన 75 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో స్పెషల్ మొబైల్ కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. కేసులను విచారించిన స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి బి. నాగలక్ష్మి ఒక వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన 74 మంది వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.7.40 లక్షల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అమాయకుల ప్రాణాలు సైతం ప్రమాదంలో పడతాయని అన్నారు. రహదారులపై ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని, అవసరమైతే ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనల అమలుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసుల ప్రాసిక్యూషన్లో సమర్థవంతంగా పనిచేసిన ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.




