
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సిందే: విద్యాశాఖ డైరెక్టర్..
-రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులకు సంబంధించి విద్యాశాఖ డైరెక్టర్ ఈ. నవీన్ నికోలస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు వివరాలను అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా బహిరంగం గా ప్రదర్శించాలని స్పష్టం చేశారు.
నోటీస్ బోర్డుపై తరగతి వారీగా ఫీజు వివరాలను ప్రదర్శించాల్సిఉంటుందని, అలాగే పాఠశాల అధికారిక వెబ్సైట్లో కూడా పూర్తి ఫీజు వివరాలను అప్లోడ్ చేయాలని సూచించారు. schooledu.telangana.gov.in పోర్టల్లో ఫీజు వివరాలను నమోదు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.ఫీజుల నిర్ణయానికి సంబంధించిన అన్ని పత్రాలను కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు.
గవర్నింగ్ బాడీ సభ్యుల సంతకాలతో ఫీజు నిర్ణయ పత్రాలను సమర్పించడం తప్పనిసరి అని తెలిపారు. G.O.Ms. No.1 రూల్ 16, 18 ప్రకారం ఫీజు నిర్ణయ పత్రాలు సమర్పించాలని వెల్లడించారు. ఫీజు వివరాలను నోటీస్ బోర్డు, వెబ్సైట్, పోర్టల్లో ప్రదర్శించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు హెచ్చరించారు.
G.O.Ms.No.1లోని రూల్ 11 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఆదేశాల అమలును జిల్లా విద్యాశాఖ అధికారులు(డీఈవోలు), ప్రాంతీయ సంయుక్త విద్యాశాఖ అధికారులు(ఆర్జేడీలు) పర్యవేక్షించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు..




