
భర్త హత్య కేసులో ఏఎన్ఎం అరెస్టు…
Web desc : భర్త పదవీ విరమణ అనంతరం వచ్చే ప్రయోజనాలను రెండో భార్యకు అందజేస్తారనే ఆగ్రహంతో భర్తను హత్య చేసిన భార్యను హుస్నాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని హనుమాన్నగర్లో ఈ నెల 16న జరిగిన కోటి వెంకటేశ్వర్లు (62) హత్య కేసులో ఆయన భార్య, ఏఎన్ఎం కోటి రాజమణిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
ఈ మేరకు హుస్నాబాద్ సీఐ కె. శ్రీధర్ బుధవారం వివరాలు వెల్లడించారు. పోలీసుల విచారణలో రాజమణి తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు, రాజమణికి సుమారు 35 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
సుమారు 15 ఏళ్ల క్రితం వెంకటేశ్వర్లు తనను, పిల్లలను దూరంగా ఉంచి మరో మహిళను రెండో వివాహం చేసుకుని ఆమెతో కలిసి ఉంటున్నట్లు రాజమణి పోలీసులకు తెలిపింది.వెంకటేశ్వర్లు ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది.
పదవీ విరమణ అనంతరం వచ్చే ప్రయోజనాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను రెండో భార్యకు అందజేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు రాజమణి తెలిపింది. తనను, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని మనసులో పెట్టుకుని భర్తపై ఆగ్రహం పెంచుకున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఈ నెల 16న వెంకటేశ్వర్లుతో రాజమణికి వివాదం జరిగింది.
మాటామాటా పెరగడంతో రోలు, రోకలిబండతో భర్తపై దాడి చేసినట్లు విచారణలో అంగీకరించింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నిందితురాలు చూపించిన ప్రదేశంలో హత్యకు ఉపయోగించిన రోలు, రోకలిబండను పోలీసులు గుర్తించారు. పంచనామా నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాజమణిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు సీఐ కె. శ్రీధర్ తెలిపారు.




