
మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. భారీగా పోలీసు బలగాల మోహరింపు
మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట్లోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు హరీశ్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది.
ఇందులో భాగంగా నగరం నలువైపులా ‘టిమ్స్’ పేరుతో సూపర్స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 2022 ఏప్రిల్ 26న ఒకేరోజు సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు సూపర్స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.యుద్ధప్రాతిపదికన పనులను పరుగులు పెట్టించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంటే ఏడాది కాలంలోనే అన్ని దవాఖానల నిర్మాణ పనులు 60 శాతానికిపైగా పూర్తయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను నిలిపివేసింది. అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కాలం గడిపింది. అయితే బీఆర్ఎస్తోపాటు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో తిరిగి పనులను పట్టాలెక్కించింది.
గత సంవత్సరమే మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి రావాల్సి ఉండగా, ప్రస్తుతం సనత్నగర్ టిమ్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే హడావుడిగా ప్రారంభోత్సం చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు హాస్పిటల్ సందర్శనకు వెళ్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు.




