
ఇంటర్ అమ్మాయిలకు వేధింపులు.. లెక్చరర్ కు దేహశుద్ధి..
Web desc : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు భాస్కర్ తీరుపై విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 18 ఏళ్లుగా అదే కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న భాస్కర్, కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు రావడంతో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
విద్యార్థినుల పట్ల ఆయన ప్రవర్తన మితిమీరడంతో, బాధితులు ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులకు, తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనితో మంగళవారం కళాశాలకు చేరుకున్న ఏబీవీపీ నాయకులు, అధ్యాపకుడు భాస్కర్ను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న విద్యార్థినిపై అధ్యాపకుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఆగ్రహించిన విద్యార్థి సంఘం నాయకులు అతడికి దేహశుద్ధి చేశారు.
అనంతరం అధ్యాపకుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట విద్యార్థినులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న సీఐ వెంకటరెడ్డి, ఎస్సై రాజు తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ధర్నాను విరమింపజేశారు. ఈ ఘటనపై డీఐవో దస్రు నాయక్ కళాశాలకు చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు.
పోలీసులు అధ్యాపకుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదన్న కారణంతో ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదని సీఐ వెంకటరెడ్డి తెలిపారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.




