
ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే!
web desc : వనపర్తి జిల్లా కాంగ్రెస్లో విభేదాల చిచ్చు తారాస్థాయికి చేరింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డి, స్థానిక శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డిల మధ్య ఆధిపత్య సమరం చినికి చినికి గాలి వానలా మారింది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి రగిలిన పాత-కొత్త నేతల అంతర్గత పోరు ఒక్కసారిగా బహిర్గతమై అధిష్టానం గడప తొక్కింది.
ఇటీవల గోపాల్పేట మండల కేంద్రంలో జరిగిన సభలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనానికి తెరలేపాయి ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చే విమర్శల కన్నా సొంత పార్టీకి చెందిన చిన్నారెడ్డి విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే మేఘా రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మరుసటి రోజే ఆధారాలతో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ మల్లురవికి , రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర ముఖ్య నేతలకు ఫిర్యాదులు చేశారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చిన్నారెడ్డి పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు డాక్టర్ చిన్నారెడ్డి వర్గీయులు గాంధీభవన్కు చేరుకొని పార్టీ కోసం గత 40 సంవత్సరాల నుంచి పని చేస్తూ వచ్చిన తమకు కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులను ఎమ్మెల్యే కట్టబెడుతున్నారని ఫిర్యాదులు చేసి చిన్నారెడ్డికి మద్దతు పలికారు. కాంగ్రెస్ నాకు దేవాలయం.. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుపై చిన్నారెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ తనకు దేవాలయం లాంటిదని, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడమే తప్ప అధిష్టానాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని లిఖితపూర్వక వివరణ ఇచ్చారు.
ఎమ్మెల్యే పార్టీ కోసం సంవత్సరాల తరబడి పనిచేసిన వారిని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడాన్ని విమర్శించాను అని తన లేఖలో పేర్కొన్నారు. ఈ వివరణను ఎమ్మెల్యే మేఘా రెడ్డి కొట్టిపారేస్తూ 90 శాతం పాత కార్యకర్తలకే తాను న్యాయం చేశానని, అసలు కాంగ్రెస్ ముసుగులో ఇతర పార్టీల వారితో ఎవరు కుమ్మక్కవుతున్నారో బయటపెట్టాలని ప్రతి సవాల్ విసిరారు.
చిన్నారెడ్డి వెంబడి ఏ పార్టీ వాళ్లు తిరుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్ఓసీలు.. ఇతర పనులు ఏ పార్టీ వారికి చేశారో తేల్చాలి అని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గాంధీభవన్ కు వచ్చిన వారిలో ఏ పార్టీ వారు ఉన్నారు గుర్తించాలన్నారు. వనపర్తి కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని ఆ పార్టీ శ్రేణులే కాకుండా ఉమ్మడి రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




