
‘నా చావుకు ఎమ్మెల్యే పీఏ, ఆ ఇద్దరు ఎస్సైలే కారణం’! కాంగ్రెస్ కార్యకర్త
web desc : సిద్దిపేట : మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వ్యవహారం శైలి కారణంగా గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు.ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి తీరుతో ఇటీవల గన్నేరువరం మండలం గుండ్లపల్లి సర్పంచ్ భర్త భేతెల్లి రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని నిప్పు అట్టించుకొని చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మరవక ముందే బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే పీఏ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడం తాజాగా కలకలం రేపుతుంది.
వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన వివరాల ప్రకారం… బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మెట్ట నాగరాజు పార్టీలో చురుకుగా పనిచేసేవాడు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని గత కొంత కాలంగా నాగరాజు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం గ్రామానికి చెందిన జెన్ జీ అనే వాట్సాప్ గ్రూప్లో మెట్ట నాగరాజు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్ చేశాడు. తన చావుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ మురళీధర్ రెడ్డి, గన్నేరువరం ఎస్ ఐ నరేందర్ రెడ్డి, బెజ్జంకి ఎస్ ఐ తోట తిరుపతి కారణమని మేసేజ్ చేశాడు.
ఈ విషయం చూసిన వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు తొందర పాటు నిర్ణయాలు వద్దు… భరోసాగా ఉంటాం, నీకు అండగా నిలుస్తామని మేసేజ్లతో ప్రతిస్పందిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు లొకేషన్ ట్రేజ్ చేసి మెట్ట నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.




