
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు… కొండా మురళీ
కాంగ్రెస్ అధిష్ఠానం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై కొండా మురళీ స్పందించారు. తమ కుమార్తె వ్యాఖ్యలకు, తమకు సంబంధం లేదన్న మురళి.. కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని తేల్చి చెప్పారు. వరంగల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండా మురళి మాట్లాడుతూ.. ‘కొండా సురేఖది, నాదీ ఒకే మాట.. మా కూతురిది వేరు మాట.
మా కూతురు ప్లాన్ బీ ఏంటో నాకు తెలీదు. మా బిడ్డ వ్యాఖ్యలకు, మాకు సంబంధం లేదు. మా గెలుపు కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. అలాంటప్పుడు మేము పార్టీని ఎలా వీడతాం. కృతజ్ఞత అనేది మా రక్తంలో ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేసేవరకూ పోరాడతాం’.. అని అన్నారు. కొండా సుస్మిత వ్యవహారంపై సురేఖ ఎందుకు స్పందించలేదనే ప్రశ్నకు మురళీ సమాధానమిచ్చారు.
‘మా కూతురు మాట్లాడిన మాటలు వ్యక్తిగతం అయినప్పటికీ.. పార్టీకి క్షమాపణలు చెప్పాలని సురేఖకు చెప్పాను. లేదంటే పేపర్ మీద రాసి ఇవ్వాలని బతిమాలాను. కానీ, సురేఖ ఒప్పుకోలేదు’.. అని అన్నారు. ‘ఎన్నిరోజులు బ్రతికామనేది కాదు.. ఎలా బ్రతికామనేదే ముఖ్యం.
మాట మీద నిలబడి ఉంటాం. పదవులు వస్తాయి, పోతాయి. వ్యక్తిత్వమే మనల్ని కాపాడుతుంది’.. అని కొండా మురళి పేర్కొన్నారు.తాము పదవులను ఆశించి పనిచేసేవాళ్లం కాదని కొండా మురళి అన్నారు. పార్టీలు మారతామన్న వార్తల్లో నిజం లేదని, కాంగ్రెస్లో ఉండి ప్రజాసేవ చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
‘వైఎస్ చనిపోయాక ఆయనిచ్చిన మంత్రి పదవి వద్దని పావురాల గుట్టలో రాజీనామా పత్రం పడేసి వచ్చాం.. కానీ పదవి కోసం పాకులాడలేదు. నమ్మితే నమ్మకంగా ఉంటాం.. లేదంటే లేదు. కార్యకర్తలే నాబలం, బలహీనత.. ఎక్కడైనా భూకబ్జాకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. అని కొండా మురళి సవాల్ చేశారు.




