
పోలీస్ స్టేషన్లో మహిళల కొట్లాట!
భార్యభర్తలు గొడవ విషయమై ఏకంగా మహిళ పోలీస్ స్టేషన్లోనే అత్తా, కోడళ్లు ఘర్షణకు దిగారు. ఈ సంఘటన గురువారం ఖమ్మం నగరంలో జరిగింది.
నగరానికి చెందిన ఓ యువతికి పాల్వంచ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న యువకుడికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.
ఇటీవల వీరిమధ్య గొడవలు జరుగుతుండడంతో సదరు యువతి ఖమ్మం మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్టేషన్లో అత్తా, కోడలికి మాటలతో వివాదం జరిగింది.
మహిళా పోలీసు స్టేషన్లో మహిళలు కొట్లాడుకున్న ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. భార్యాభర్తల కేసు విషయంలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఇరువర్గాలకు సంబంధించిన బంధువులు స్టేషన్లోనే కొట్టుకోవడం, ఒకరిపై ఒకరు చెప్పులతో దాడిచేసుకోవడం పోలీసులను విస్మయానికి గురిచేసింది.
పోలీసులు చెబుతున్నా వినకుండా వాళ్లు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ లేకపోవడంతో అక్కడకు వచ్చిన ఇరు వర్గాలను మాట్లాడుకోమని స్టేషన్ సిబ్బంది చెప్పడంతో వీళ్లు మాటకు మాట అనుకుంటూ ఆవేశంతో ఊగిపోయారు.
ఒకరిపై ఒకరు తీవ్ర దూషణలు చేసుకోవడంతో ఒక్కసారిగా గొడవ చెలరేగింది. అక్కడున్న మహిళా కానిస్టేబుళ్లు, ఇరువర్గాల బంధువులను హెచ్చరించి అక్కడి నుంచి పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది.