కాంగ్రెస్లో చేరిన ఇందిరాశోభన్
సీనియర్ నేత ఇందిరాశోభన్ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాధ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఇందిరాశోభన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాధ్, సీఎం రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లో పార్టీ ఆదేశాల మేరకు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
తన రాజకీయ జీవితానికి పునాది వేసిన.. మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు సేవచేసుకునే ఆవకాశం వచ్చిందని, నిరంతరం ప్రజల మధ్య ఉంటానని అన్నారు.