
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
– తెలంగాణ లంబాడా హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమా నాయక్
విద్య అనేది ప్రతి చిన్నారి రాజ్యాంగబద్ధ హక్కు అని, విద్యా హక్కు చట్టం (RTE Act) అమలును నిర్లక్ష్యం చేస్తున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం మరియు విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ లంబాడా హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమా నాయక్ డిమాండ్ చేశారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలు, రిజర్వేషన్లు, హక్కులను అమలు చేయకుండా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే ప్రత్యేక విచారణ నిర్వహించి, చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అవసరమైతే ఆయా పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఆయన కోరారు.
గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విద్యా హక్కు చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా తెలంగాణ లంబాడా హక్కుల పోరాట సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుందని గుగులోత్ భీమా నాయక్ హెచ్చరించారు.
విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం విద్యాశాఖ వెంటనే స్పందించి చట్టబద్ధ చర్యలు చేపట్టాలని తెలంగాణ లంబాడా హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తోంది.




