
మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత
హైదరాబాద్లో విషాదం నెలకొంది. ప్రముఖ నాయకుడు, మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయనను వైద్యులు అత్యవసర చికిత్స విభాగం (ICU)లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాల నుంచి పూర్తి హెల్త్ బులెటిన్ వెలువడాల్సి ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ప్రార్థిస్తున్నారు.
వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అట్టడుగు స్థాయి నుంచి ఎదిగారు. 1990లలో ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత మక్తల్ గ్రామ సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలు అందించారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుదీర్ఘ అనుభవం గడించిన ఆయనకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం మక్తల్ టికెట్ కేటాయించింది.
ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. శాసనసభ ఎన్నికల్లో సాధించిన విజయం, నిబద్ధత గల నాయకత్వానికి గుర్తింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వాకిటి శ్రీహరికి స్థానం దక్కింది.
జూన్ 8న ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. పశుసంవర్థక, క్రీడలు & యువజన సర్వీసుల శాఖల బాధ్యతలు కేటాయించారు. అలాగే ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.




