
అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ..
8 తులాల బంగారం అపహరణ
సీసీ కెమెరాలు పైకి మలచి..
కూతురు పెళ్లి కోసం దాచుకున్న సొత్తు..
సి కె న్యూస్ ప్రతినిది
తిరుమలాయపాలెం మండలంలో గురువారం రాత్రి చోరీ ఘటన కలకలం రేపింది. మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన మల్లెబోయిన యాదిగిరి కరుణ శ్రీ అనే దంపతులు.
వీరి కుమారుడు కెనడాలో చదువుకుంటుండగా, కూతురు ఇక్కడే బీటెక్ పూర్తి చేసింది. వీరు గ్రామంలోని ఖమ్మం – వరంగల్ హైవే పక్కన ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటూ కిరణ షాప్ నిర్వహిస్తున్నారు.
అయితే వారి బంధువుల్లో ఒకరు మృతి చెందగా, కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలకు వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి ఉన్నాయి. కంగారు పడిన వారు వెంటనే ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువా తాళాలు పగలగొట్టి డోర్లు ఓపెన్ చేసి అందులో ఉన్న ఎనిమిది తులాల బంగారు అభరణాలతో పాటు, సుమారు లక్ష రూపాయలకు పైగా నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
సీసీ కెమెరాలు పైకి మలచి..
ముందస్తు జాగ్రత్తగా యాదగిరి ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దొంగలు ఇంటి ముందున్న మెయిన్ డోర్ నుంచి వెళ్తే సీసీ కెమెరాలు రికార్డు అవుతుందని, పక్కా ప్రణాళిక ప్రకారం ఇంటి వెనుక ప్రహరీ గోడ దూకి అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పైకి మలచి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు.
కూతురు పెళ్లి కోసం దాచుకున్న సొత్తు..
యాదగిరికి తన బీటెక్ పూర్తి చేసిన కూతురుకి మ్యారేజ్ చేద్దామనుకుని ముందుగా బంగారు ఆభరణాలు కొని దాచుకున్నారు. ఈ లోపే బంధువుల్లో ఒకరు మృతి చెందడం, అంత్యక్రియల కోసం యాదగిరి కుటుంబ సభ్యులందరూ వెళ్లడం గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని, లక్ష రూపాయలకు పైగా నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై కూచిపూడి జగదీశ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంని అలాగే సీసీఎస్ బృందాలను రప్పించి, ఫింగర్ ప్రింట్స్ ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ను సైతం పరిశీలిస్తున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు.



