
ఒంటరి మహిళ ఇల్లు కూల్చివేత.. సర్పంచ్ పై ఆరోపణలు
సూర్యాపేట : ఆత్మకూరు(ఎస్) మండలం కోటి నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని కాళ్ల భావ్సింగ్ తండాలో ఒంటరి మహిళ నివాసాన్ని కూల్చివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ సర్పంచ్ ధరావత్ చిట్టి రవికుమార్ ఆదేశాలతోనే తన ఇంటిని కూల్చివేశారని బాధితురాలు ధరావత్ ప్రమీల ఆరోపించింది.
ప్రమీల తన కుమార్తెతో కలిసి తండాలో నివాసం ఉంటోంది. సుమారు పది రోజుల క్రితం తన ఇంటిని కూల్చివేస్తామని సర్పంచ్ బెదిరించారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తాను విషం తాగినట్లు ఆమె తెలిపింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చినట్లు పేర్కొంది.
ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన మరుసటి రోజే సర్పంచ్ బంధువులు తన ఇంటి వద్దకు వచ్చి ఇల్లు కూల్చివేశారని ప్రమీల వాపోయింది. ఇంటిని కూల్చివేసే సమయంలో తనపై దాడి చేశారని కూడా ఆమె ఆరోపించింది. దీంతో తాను తన కుమార్తెతో కలిసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు అండగా నిలవాల్సిన గ్రామపంచాయతీ పాలకవర్గం నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం బాధాకరమని ప్రమీల కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరింది.
తనకు సొంత నివాసం లేకుండా పోయిందని, అధికారులు స్పందించి ప్రభుత్వ పరంగా గృహాన్ని నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.




