
మారుమూల గ్రామాల్లో ‘బిఎస్ఎన్ఎల్’ సేవలు మెరుగుపరచాలి
ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అధికారులకు సూచించిన టీఏసీ సభ్యులు
ఖమ్మం: గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ సమస్యలను తక్షణమే పరిష్కరించి, వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించాలని టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సభ్యులు బిఎస్ఎన్ఎల్ అధికారులను కోరారు. శుక్రవారం ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో టీఏసీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న నెట్వర్క్ ఇబ్బందులపై కమిటీ సభ్యులు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశంలో కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, రంజిత్ నాయక్, మచ్చా రామారావు, సత్యనారాయణ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పలు కీలక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అనేక అంశాల ప్రస్తావన..
కూసుమంచి ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు అత్యంత పేలవంగా ఉన్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని, వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ ఖమ్మం కార్యాలయంలో సిమ్ కార్డులు నిరంతరం అందుబాటులో ఉంచాలని కోరారు. బోనకల్, చింతకాని మండలాల్లో నెట్వర్క్ పరిధిని విస్తరించేందుకు మరిన్ని నూతన టవర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గోవిందాపురం గ్రామంలో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ అస్సలు అందడం లేదని, అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి పరిశీలించాలని కోరారు. వైరా, బ్రాహ్మణపల్లి, ఉప్పలమడక గ్రామాల్లో నెలకొన్న సిగ్నల్ సమస్యలను పరిష్కరించాలన్నారు.
నూతన టవర్ల ఏర్పాటుకు తీర్మానం
ఖమ్మం రూరల్ మండలం కస్నా తండా, నగరంలోని ఇందిరానగర్, గోశాల ప్రాంతాల్లో మెరుగైన సిగ్నల్ కోసం నూతన టవర్ల ఏర్పాటు అంశాన్ని త్వరితగతిన ఆచరణలోకి తేవాలని సమావేశం తీర్మానించింది.
అధికారుల అభయం..
టీఏసీ సభ్యుల విజ్ఞప్తులపై బిఎస్ఎన్ఎల్ డీజీఎం రాజశేఖర్, ఏజీఎం స్పందిస్తూ.. సమస్య తీవ్రతను బట్టి ప్రాధాన్యత క్రమంలో అవసరమైన చోట కొత్త టవర్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ రఘురాంరెడ్డి సూచనల మేరకు పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి, సిగ్నల్, ఇంటర్నెట్ సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



