
డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య…
కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇలా రకరకాల కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో అడ్డంకులను ఎదుర్కొని ముందుకు సాగాల్సిందిపోయి సమస్యల వలయంలో చిక్కుకుని పరిష్కారం కోసం ప్రయత్నించకుండా తనువు చాలిస్తున్నారు.
ఆత్మహత్య మహాపాపం అని తెలిసి కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ బీటెక్ విద్యార్థిని డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
ఏం కష్టమొచ్చిందో ఏమో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో డీజిల్ పోసుకుని నిప్పింటించుకుని అగ్నికి ఆహుతైపోయింది. ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన ఓ కుటుంబం బడంగ్పేట మారుతీనగర్లో నివాసం ఉంటోంది.
కీర్తి(21) గండిపేట లోని ఎంజీఐటీ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు తల్లి, సోదరి, అన్న ఉన్నారు. శనివారం కళాశాలకు వెళ్లిన కీర్తి.. మధ్యాహ్నం ఇంటికి వచ్చింది.
సాయంత్రం కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లగా.. కీర్తి డీజిల్ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంటలు వ్యాపించి కేకలు, పొగ రావడంతో ఇరుగు పొరుగు వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వారు ఇంటికి చేరుకునేసరికి కీర్తి మంటల్లో కాలిపోయి మృతిచెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కీర్తి సోదరుడు నాగరాజు మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.




