
ఎన్ఎస్పీ కాలువ భూ ఆక్రమణ
ఉపాధి హామీ మొక్కల నాటకంలో వెలుగులోకి వచ్చిన భూ ఆక్రమణ
కాలువ రక్షిత ప్రాంతంలో పామాయిల్ మొక్కలు..
సెలవు రోజున మొక్కల నాటకంపై అనుమానాలు..
ఎన్ఎస్పీ కాలువ భూ ఆక్రమణపై పరిశీలన
పామాయిల్ మొక్కలను పీకివేసిన అధికారులు
వెలుగులోకి వచ్చిన ఆక్రమణ ఆనవాళ్లు
విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 13 2026: ఏన్కూరు మండల పరిధిలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ) ప్రధాన కాలువకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ రక్షిత భూమి ఆక్రమణకు గురైందనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఉపాధి హామీ పథకం కింద కాలువ గట్లపై మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానికుల సమాచారం ప్రకారం, ఎన్ఎస్పీ ప్రధాన కాలువకు ఆనుకుని ఉన్న రక్షిత ప్రాంతంలో ఇటీవల సీతారామ ప్రాజెక్టు పనుల కోసం మట్టిని తరలించడంతో సుమారు నాలుగు ఎకరాల మేర భూమి చదునుగా మారింది. అనంతరం కాలువకు ఆనుకుని ఉన్న ఈ ప్రభుత్వ భూమిలో పామాయిల్ మొక్కలు నాటినట్లు గుర్తించారు. ప్రభుత్వ రక్షిత ప్రాంతంలో ఈ విధంగా సాగు చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.
స్థానికుల ఆరోపణల ప్రకారం, ఆదివారం సెలవు రోజున ఆక్రమణ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైతు పామాయిల్ మొక్కలు నాటించినట్లు చెబుతున్నారు. అనంతరం సోమవారం రోజున ఉపాధి హామీ పథకం కింద కాలువ గట్లపై మొక్కలు నాటే కార్యక్రమం కోసం అధికారులు అక్కడికి వెళ్లిన సమయంలో ఈ విషయం వారి దృష్టికి వచ్చింది.
సంఘటనా స్థలాన్ని డీఈ కే ఆనంద్, ఏఈ పూనంచంద్,ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ, ఏపీవో సూరయ్య,లస్కర్ పరిశీలించారు. పరిశీలన సందర్భంగా కాలువ రక్షిత ప్రాంతంలో నాటిన కొన్ని పామాయిల్ మొక్కలను తొలగించారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పండ్ల మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అయితే కాలువ రక్షిత ప్రాంతంలో పామాయిల్ మొక్కలు నాటే వరకు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి ఈ విషయం ఎందుకు రాలేదనే ప్రశ్నలు స్థానికులు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత కలిగిన శాఖలు తరచూ పర్యవేక్షణ నిర్వహిస్తున్నప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో భూమి వినియోగంలో మార్పులు ఎలా జరిగాయనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి కాలువ సరిహద్దులు, భూ రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. విచారణలో ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగినట్లు తేలితే ఆక్రమణకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటారా, చట్టపరమైన చర్యలు ఉంటాయా అనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




