
వీల్ చైర్ లేక రోగిని భుజాల మీద తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
వరంగల్ ఎంజీఎంలో దయనీయ పరిస్థితులు
వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు కనీస వసతులు అందడం లేదనే ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఎక్స్రే పరీక్ష కోసం రోగిని తీసుకెళ్లేందుకు వీల్చైర్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులే అతడిని భుజాల పై మోసుకెళ్లిన దృశ్యం చర్చనీయాంశంగా మారింది.
ఆసుపత్రిలో వీల్చైర్లు అందుబాటులో లేకపోవడంతో రోగుల వెంట వచ్చే కుటుంబ సభ్యులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పై ప్రజలు మండిపడుతున్నారు.
ఎంజీఎంలో వసతుల లేమి, నిర్వహణ లోపాల పై గతంలోనూ పలు ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు, వైద్యశాఖ స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగులకు కనీసం వీల్చైర్ కూడా అందుబాటులో లేకపోతే ఆసుపత్రి నిర్వహణ ఎలా సాగుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎంజీఎంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




