
చికిత్స పేరుతో చిత్రహింసలు.. రీహాబిలిటేషన్ సెంటర్లో దారుణాలు
web desc : వ్యసన విముక్తి పేరుతో నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేటు రీహాబిలిటేషన్, డీ-అడిక్షన్ సెంటర్లు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. వ్యసనానికి బానిసైన వారిని చికిత్స పేరుతో చిత్రహింసలకు గురిచేస్తూ, వారి కుటుంబాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా వనస్థలిపురం హిల్కాలనీలోని సంకల్ప రీహాబిలిటేషన్, డీ-అడిక్షన్ సెంటర్పై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మద్యానికి బానిసైన వ్యక్తిని కుటుంబ సభ్యులు ఇటీవల ఈ కేంద్రంలో చేర్పించారు. అయితే చికిత్స పేరుతో నిర్వాహకులు అతడిని విచక్షణారహితంగా కొట్టడంతో మృతి చెందినట్లు సమాచారం.
30 బెడ్లకు అనుమతి.. 108 మందికి వసతి? సంకల్ప రీహాబిలిటేషన్, డీ-అడిక్షన్ సెంటర్కు 30 పడకల సామర్థ్యానికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ.. ఏకంగా 108 మందిని ఉంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే కేంద్రంలో ఇంత మందిని ఉంచితే వారి భద్రత, ఆరోగ్యం, పారిశుధ్యం, వైద్య పర్యవేక్షణ వంటి అంశాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేంద్ర నిర్వహణకు అవసరమైన పూర్తిస్థాయి అనుమతులు ఉన్నాయా? 30 పడకలకు అనుమతి ఉన్నప్పుడు 108 మందిని ఎలా చేర్చుకున్నారు? అధిక సంఖ్యలో బాధితులను ఉంచేందుకు అదనపు సదుపాయాలు కల్పించారా? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
అధ్వానంగా కిచెన్.. నాసిరకం ఆహారం?
కేంద్రంలోని వంటశాల నిర్వహణ సైతం అధ్వానంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితులకు నాణ్యమైన, పోషకాహారాన్ని అందించాల్సి ఉండగా సరైన ఆహార పదార్థాలు ఇవ్వడం లేదని అక్కడి బాధితులు చెబుతున్నట్లు సమాచారం. డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు ఇప్పటికే మానసికంగా, శారీరకంగా బలహీనమైన స్థితిలో ఉంటారు.
అలాంటి వారికి వైద్యుల పర్యవేక్షణ, కౌన్సెలింగ్, పోషకాహారం, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సి ఉంటుంది. కానీ అనుమతులకు మించి బాధితులను చేర్చుకుని, సరైన సదుపాయాలు కల్పించకపోతే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వనస్థలిపురంలోని సదరు కేంద్రంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా సంక్షేమ శాఖ, పోలీసు అధికారులు విచారణ చేపట్టాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.




