
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని ప్రకటించారు.
సభా కార్యకలాపాలకు అడ్డుపడడమే ఇందుకు కారణంగా ఆయన తెలిపారు. బుధవారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. సభా కార్యకలాపాలకు బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడ్డారు. మంత్రులు మాట్లాడుతున్న టైంలో.. స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు.
నిన్న కేసీఆర్ ఫామ్హౌజ్ ముట్టడికి కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రయత్నించిన క్రమంలో.. తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్.. వెళ్లి సీట్లలో కూర్చోవాలని బీఆర్ఎస్ సభ్యుల్ని కోరారు.
అయితే వాళ్లు ఆ మాట వినలేదు. దీంతో వాళ్లను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పీకర్ను కోరారు. ఆ వెంటనే వాళ్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. 17 మంది బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
హరీష్ రావు, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్ కుమార్, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీతా లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ప్రశాంత్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు.
శాసనసభ సమావేశాలు సజావుగా జరగనివ్వాలని.. ప్రతీ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశాలకు అంతరాయం కలిగించారు. ఇటు శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.




