
ఇకపై బైకులకు కూడా టోల్..? జూలై 15 నుంచి హైవేపై వెళ్లాలంటే డబ్బు కట్టాల్సిందే..?
జులై 15 నుంచి భారతదేశంలోని ద్విచక్ర వాహనాలు హైవేలపై టోల్ చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంతో కాలంగా ఫ్రీగా వెళ్తున్న మినహాయింపు ముగుస్తుంది. ఇప్పటివరకు బైక్లకు చాలా టోల్ రోడ్లు, ఎక్స్ప్రెస్వేలపై ఉచిత ప్రవేశం ఉండేది. ఇది తక్కువ ఆదాయం ఉన్నవారికి ఆర్థిక భారం తగ్గించడానికి, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్లు రాకుండా ఉండేందుకు ఉద్దేశించబడింది.
అయితే, హైవేలపై టూ వీలర్ల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల రోడ్లు త్వరగా పాడవుతున్నాయని, ట్రాఫిక్ నిర్వహణలో సవాళ్లు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అందుకే ఇప్పుడు టూ వీలర్లను కూడా టోల్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ కొత్త విధానం లక్షలాది మంది టూ వీలర్ల వాహనదారులకు, ముఖ్యంగా రోజూ హైవేలపై ప్రయాణించే వారికి, డెలివరీ పనుల్లో ఉన్నవారికి ఆర్థికంగా, లాజిస్టికల్గా మార్పులు తేనుంది.
టూ వీలర్లకు టోల్ రేట్లు పెద్ద వాహనాల కంటే తక్కువగా ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. అయినా సరే, రోడ్ల నిర్వహణ, విస్తరణ కోసం అవసరమైన నిధులకు ఇది ఉపయోగపడుతుంది.
ప్రభుత్వం టూ వీలర్ల కోసం ప్రత్యేకంగా డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఇందులో ఫాస్టాగ్ ఇంటిగ్రేషన్, యాప్ ఆధారిత బిల్లింగ్ ఉంటాయి. దీనివల్ల టోల్ పాయింట్ల వద్ద ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మౌలిక సదుపాయాల నిపుణులు, నిర్ణేతలు దీన్ని రోడ్ల నిర్వహణకు అవసరమైన చర్యగా సమర్థిస్తున్నారు.
అయితే, సాధారణ ప్రజలు, ప్రయాణికుల బృందాలు మాత్రం అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల హైవేలపై బైక్ల వాడకం తగ్గుతుందని, ఎక్కువ ట్రాఫిక్ నగర రోడ్ల మీదకు మళ్లి, నగరాల్లో రద్దీ, కాలుష్యం పెరగొచ్చని విమర్శకులు అంటున్నారు.
కొందరు ఈ విధానం తక్కువ ఆదాయం ఉన్న వాహనదారులపై మరిన్ని ఛార్జీలకు దారి తీస్తుందని భయపడుతున్నారు. అమలు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, ఈ మార్పును ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుంది.. బలహీన వర్గాలకు ఏదైనా ఉపశమనం కల్పిస్తుందా లేదా అనేది చూడాలి.