
ఐపీఎస్కి రాజీనామా.. ఎందుకంటే..
యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ సిద్దార్థ్ కౌశల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛందంగా ఐపీఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు 2025, జూలై 2న లేఖ విడుదల చేశారు.
పూర్తిగా వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నానని.. నా రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని స్పష్టం చేశారు సిద్దార్థ్ కౌశల్. దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలు, నా కుటుంబ సభ్యులతో చర్చించ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులతో రాజీనామా చేస్తోన్నట్లు వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవని అన్నారు సిద్దార్థ్ కౌశల్.
రాజీనామా నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకుంటున్నానన్నారు. ఐపీఎస్గా సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇచ్చిందని.. ఇది నా జీవితంలో ఓ అద్భుత ప్రయాణమన్నారు. ఆంధ్రప్రదేశ్ను నా సొంత ఇల్లుగా భావించానని.. ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ హృదయంలో నిలిచి ఉంటాయన్నారు కౌశల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, నా సీనియర్లకు, సహోద్యోగులకు, జూనియర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని..
మీ మద్దతు, నమ్మకం నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని పేర్కొన్నారు సిద్దార్థ్ కౌశల్. రాబోయే రోజుల్లో కొత్త మార్గాల్లో సమాజానికి సేవ చేస్తానన్నారు.
గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా పని చేసిన సిద్దార్థ్ కౌశల్ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో అంటకాగారనే ఆరోపణలపై కూటమి ప్రభుత్వం సిద్దార్థ్ కౌశల్కు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది.
ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా విధులు నిర్విర్తిస్తున్న సిద్దార్థ్ కౌశల్.. వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వ రాజకీయ వేధింపుల వల్లే ఐపీఎస్ ఆఫీసర్ సిద్దార్థ్ కౌశల్ వీఆర్ఎస్ తీసుకుంటున్నారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో సిద్దార్థ్ కౌశల్ వీఆర్ఎస్ వ్యవహారం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ గా మారింది.