
ఫిరాయింపులపై యాక్షన్ షురూ చేసిన తెలంగాణ స్పీకర్.. ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ!
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పంపించారు. స్పీకర్ నోటీసులపై గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లోగా తన దగ్గరకు వచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
పార్టీ ఫిరాయింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా విచారణను మరింత జాప్యం చేసే ప్రయత్నాలు చేస్తే, అనుమతించవద్దని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఒకవేళ అలా ఎవరైనా చేస్తే.. ఆ ఎమ్మెల్యేకు ప్రతికూలంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పీకర్కు సూచించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించించినట్లు సమాచారం.
ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అయితే 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి శుక్రవారం(ఆగస్టు 22) నోటీసులు పంపించారు.
వీరి విచారణ ముగిసిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి వీరి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో పోచారం శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్రెడ్డి, మహిపాల్రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్లపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ జరిపిన సుప్రీంకోర్టు, వారందరికీ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని ఆదేశించింది.
స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నదీ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నోటీసులు అందుకున్నా వారిలో గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. నోటీసులపై ఆయన స్పందించారు.
స్పీకర్ కార్యాలయం నుండి నోటీసు అందినట్లు తెలిపారు. దానిపై న్యాయనిపుణులతో చర్చించి, స్పీకర్కు వివరణ ఇస్తానని ఆయన తెలిపారు. తాను పార్టీ మారలేదని, టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పష్టం చేశారు.
గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. ఇప్పటికీ తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.