
ఒ పాజిటివ్కు బదులు బి పాజిటివ్.. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం
Web desc : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓ రోగికి ఒక గ్రూపు రక్తానికి బదులుగా మరో గ్రూపు రక్తం ఎక్కించారు. బాధితురాలి భర్త రాజు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి(34) జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ.. ఈ నెల 16న ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.
పరీక్షించిన వైద్యులు ఆమెకు రక్తం చాలా తక్కువగా ఉందని చెప్పారు. 17న రక్తం కోసం శాంపిల్ తీసి రక్తనిధి కేంద్రానికి పంపించగా.. టెక్నీషియన్లు ఆమెది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్గా నిర్ధారించారు. జూనియర్ వైద్యులు ఆ ప్రకారం రక్తం తెచ్చి బాధితురాలికి ఎక్కించారు.
ఈ నెల 18న మరో ప్యాకెట్ ఎక్కించారు. బాధితురాలు తనది ‘ఒ’ పాజిటివ్ అని చెప్పినా.. వార్డులోని సిబ్బంది ఆమె మాట వినలేదు. అప్పటికే బాధితురాలికి కడుపులో నొప్పి, విరేచనాలు మొదలయ్యాయి.
శనివారం మరో ప్యాకెట్ రక్తం ఎక్కించాల్సి ఉండగా ఆమె బ్లడ్గ్రూప్పై కలిగిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి వార్డు సిబ్బంది రక్తనిధి కేంద్రానికి మరోసారి శాంపిల్ పంపించారు. టెక్నీషియన్లు ‘ఒ’ పాజిటివ్గా నిర్ధారించారు. వెంటనే వైద్యులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
ఒక గ్రూప్ బదులు మరో గ్రూప్ రక్తం ఎక్కించడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదముందని, కొన్నిసార్లు దద్దుర్లు, ఇతర సమస్యలు రావొచ్చని, కొందరిలో మూడు నెలల తర్వాత కూడా సమస్యలు బయటపడతాయని వైద్య నిపుణులు తెలిపారు.
ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డా.కిశోర్కుమార్ మాట్లాడుతూ.. ‘విచారణ జరుపుతున్నాం. పాథాలజీ, జనరల్ మెడిసిన్, రక్తనిధి కేంద్రం వైద్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉంది’ అని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




