
వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
Web desc : పాల్వంచ పట్టణంలో వైద్య నిర్లక్ష్య ఆరోపణలు మరోసారి కలకలం రేపాయి. కేటీపీఎస్లో ఉద్యోగిగా పనిచేస్తున్న అనపర్తి నాగేశ్వరరావు చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం ఖమ్మం వెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
.కాళ్లకు బొబ్బలు వచ్చాయని చికిత్స కోసం వచ్చిన నాగేశ్వరరావుకు అవసరానికి మించి యాంటిబయాటిక్స్ (హై డోస్) ఇచ్చారని బంధువులు ఆరోపిస్తున్నారు.
సరైన వైద్య పరీక్షలు లేకుండా మందులు ఇచ్చారని, అసలు పేషెంట్కు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ అర్హతల పై అనుమానాలు.. సదరు డాక్టర్ తనను ఎంఎస్ సర్జన్గా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేసుకొని, జనరల్ ట్రీట్మెంట్ చేయడం ఏమిటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈయన డాక్టర్ కంటే యాక్టర్లా ప్రవర్తిస్తున్నారు. అంటూ స్థానికులు విమర్శలు చేస్తున్నారు.
వైద్య వృత్తి కంటే ఎక్కువ సమయం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్ తయారీలోనే గడుపుతారని, వైద్యం పై కంటే డబ్బులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరుస ఘటనలు… పెరుగుతున్న అనుమానాలు.. ఈ ఒక్క ఘటనతోనే కాదు, గతంలోనూ పలువురు ఈ ఆసుపత్రి చికిత్స పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మెడికల్ డిస్ట్రిబ్యూటర్లతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని ఒక మెడికల్ మాఫియా నడుపుతున్నారనే ఆరోపణలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. ఆసుపత్రి పేరుతో కోట్ల రూపాయలు సంపాదించి రిసార్టులు కూడా నడుపుతున్నారన్న ప్రచారం పాల్వంచలో చర్చనీయాంశంగా మారింది.
ప్రజల్లో తీవ్ర ఆగ్రహం.. ఇటీవలే విజయ నర్సింగ్ హోమ్లో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ మృతి చెందిన ఘటన ప్రజలు మరవకముందే,
ఈ ఘటన జరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాల్వంచలో జరుగుతున్న వరుస వైద్యఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఆసుపత్రి ఎదుట ఆందోళన.. విజయసాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ కిరణ్ కుమార్ హై డోస్ మందులు ఇవ్వడమే నాగేశ్వరరావు మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే డాక్టర్ నుంచి ఎలాంటి స్పష్టమైన వివరణ రాకపోవడంతో బంధువులు రాత్రి 11 గంటల వరకు పోలీసులతో కలిసి ఆసుపత్రి ఎదుటే వేచిచూశారు.
సమగ్ర విచారణ కోరుతున్న బాధితులు ఈ ఘటన పై స్వతంత్ర విచారణ జరిపించి, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాల్వంచలో ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరు పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.




