
తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే విద్యాభివృద్ధి
నాచారం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా పేరెంట్-టీచర్ సమావేశం
విద్యార్థులకు రూ.6 వేల విలువైన విద్యా సామగ్రి పంపిణీ
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 18 2026: ఏన్కూరు మండల పరిధిలోని నాచారం గ్రామం ప్రాథమిక పాఠశాల (కాలనీ)లో శనివారం పేరెంట్-టీచర్ సమావేశం (పీటీఎం) నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి వాసవి దేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దాత గాదే శేషయ్య సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి సుమారు రూ.6 వేల విలువైన నోట్బుక్స్, పెన్సిళ్లు, పెన్నులు తదితర విద్యా సామగ్రిని విద్యార్థులకు అందజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా నిర్వహించగా, ఆయన సేవాభావాన్ని అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోత్ హతిరామ్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజం సహకారం ఎంతో అవసరమని, గాదే శేషయ్య చేసిన సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మేడేపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సేవ్యా నాయక్, ఉపాధ్యాయురాలు నాగ శిరీష, కాంప్లెక్స్ సీఆర్పీ కృష్ణ ప్రసాద్, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల సంక్షేమం కోసం పాఠశాల, తల్లిదండ్రులు, సమాజం కలిసి పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు.




