
ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య
Web desc : తిరుపతి జిల్లా పుత్తూరు టౌన్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
కృష్ణానగర్ మూడవ వీధిలో నివాసం ఉంటున్న పద్మ అనే మహిళ తన పిల్లలు తేజ (7), లాస్య(5)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పద్మ శివకుమార్ లు పుత్తూరులోని కృష్ణానగర్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
వీళ్లకు తేజశ్రీ(7), లాస్య(5) ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు ప్రస్తుతం పుత్తూరులోని ఒక ప్రైవేటు స్కూల్లో చదువుతుండగా శివకుమార్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.
అయితే గత కొన్ని రోజులుగా శివకుమార్ జాబ్కు వెళ్లడం మానేశాడు. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. అయితే శనివారం శివకుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో భార్య పద్మ తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే బయటకు వెళ్లిన ఇంటికొచ్చిన భర్త శివకుమార్కు.. భార్య పద్మ, ఇద్దరు బిడ్డలు ఫ్యాన్కు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. అది చూసిన శివ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
వెంటనే పద్మ తల్లిదండ్రులతో పాటు స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. వీరి ఆత్మహత్యకు కేవలం ఆర్థిక ఇబ్బందులే కారుణమా లేదంటే మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



