
హైదరాబాద్ శివార్లలో భూ ప్రకంపనల కలకలం .. ఉలిక్కిపడ్డ స్థానికులు ..!
హైదరాబాద్ నగర శివార్లలో మంగళవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లుగా అనిపించడంతో పాటు పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ఒక్కసారిగా లేచి బయటకు పరుగులు తీయగా కొందరు ఇది భూకంపమేనని అనుమానిస్తున్నారు. అయితే తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్దగా నష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. మెట్ఖాన్గూడ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. భూమి స్వల్పంగా కంపించిన సమయంలో భారీ శబ్దం వినిపించినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. సెక్యూరిటీ గేట్ వద్ద ఉన్న వస్తువులు కదిలినట్లు అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనట్లు దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదే ప్రాంతంలో ఉన్న స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభావం కనిపించింది. తరగతి గదుల్లో ఉన్న బెంచీలపై పెట్టిన జామెంట్రీ బాక్సులు కింద పడిపోయాయని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు ఆ సమయంలో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటన భూకంపమేనా లేక భూగర్భంలో జరిగిన మరేదైనా పరిణామమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. భూకంప కేంద్రం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ అనుభూతి కనిపించడంతో స్థానికంగా జరిగిన పేలుడు లేదా భూగర్భ కదలిక అయి ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. శాస్త్రీయంగా కారణాలు నిర్ధారిస్తే భవిష్యత్తులో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.



