
రాత్రివేళ బైక్ దొంగతనం కలకలం
బైక్ అపహరించి దూరంలో వదిలేసిన దొంగలు
అప్రమత్తం చేస్తున్న బైక్ దొంగతనం ఘటన
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 14 2026: ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామానికి చెందిన ధరావత్ జయరాం ఇంటి వద్ద ద్విచక్ర వాహనం దొంగతనానికి గురైన ఘటన గ్రామంలో కలకలం రేపింది. బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి ఇరువైపులా బయట నుంచి గోల్డెన్ పెట్టి లోపలి వారు ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తగా కుట్ర పన్ని ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
అనంతరం ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న బైక్ను అపహరించి కొంత దూరం వరకు తీసుకెళ్లిన దుండగులు, ఏమైందో తెలియదు గాని సమీపంలోని ఓ ప్రదేశంలో వదిలేసి అక్కడి నుంచి పరారైనట్లు బాధితులు తెలిపారు. ఉదయం నిద్రలేచి చూసిన కుటుంబ సభ్యులు బైక్ కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లో వెతికిన అనంతరం ఇంటికి కొద్ది దూరంలో బండి కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. రాత్రి వేళల్లో గ్రామాల్లో గస్తీ పెంచి ఇలాంటి దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు. అలాగే ఇంటి బయట వాహనాలను ఉంచే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు పేర్కొంటున్నారు.



