
నిమ్స్లో 850 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ వైద్య సంస్థ నిమ్స్ (నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రి విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.వైద్య సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు
విస్తరణ ప్రణాళికలో భాగంగా సుమారు 850 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు తదితర విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. ఈ నియామకాలతో ఆసుపత్రిలో మానవ వనరుల కొరత తీరే అవకాశం ఉంది. ఇటీవల నిమ్స్కు 125 ఆధునిక వెంటిలేటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే రూ.1,698 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. కొత్త బ్లాక్స్, అదనపు బెడ్లు, ఆధునిక వైద్య పరికరాలు, అత్యవసర విభాగాల అభివృద్ధి వంటి పనులు ఈ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్నారు.
ఇటీవలి కాలంలో నిమ్స్కు ప్రభుత్వ గ్రాంట్లు గణనీయంగా పెరిగాయి. సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా ఏడాదిలోనే రూ.122 కోట్ల నిధులు అందడంతో ఆసుపత్రి అభివృద్ధికి మరింత ఊతం లభించింది.
ఈ విస్తరణతో రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని, హైదరాబాద్ను దేశంలో ప్రముఖ మెడికల్ హబ్గా మార్చడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.




