
మంత్రి వివేక్ కాన్వాయ్పై రాళ్లు, చెప్పుల దాడి
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాళ్లదాడికి దారితీసింది.
ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు ఇటు బీఆర్ఎస్ , అటు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ వద్దకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్, పోలీసులపై రాళ్లదాడి చేశారు.
ఈ ఘటనలో మంత్రి వివేక్ కారుతో పాటు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. పోలీస్ కానిస్టేబుల్, మరో ఇద్దరికి గాయాలయినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్ఎస్-10, కాంగ్రెస్-7, సీపీఐ 4, ఇండిపెండెంట్-1 గెలుపొందారు. ఇక్కడ రెండు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ బలం ఇక్కడ 10కి చేరింది.
ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఇరు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నిన్నటి నుంచి ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.




