
అంబులెన్స్లోనే సుఖప్రసవం.. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో తల్లీబిడ్డలు క్షేమం
ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం ప్రాంతానికి చెందిన నిషా భాను (27), (భర్త మహమ్మద్ సమీర్) కు రెండో కాన్పు సమయం రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఉప్పల్ 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగరాజు, పైలట్ ఉపేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గర్భిణిని ఆస్పత్రికి తరలించడం ప్రారంభించారు.
అయితే మార్గమధ్యలో పురిటి నొప్పులు తీవ్రం కావడంతో డాక్టర్ల సూచనలతో, అంబులెన్స్లోనే ప్రసవం నిర్వహించారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో నిషా భాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం తల్లి, శిశువును సురక్షితంగా ఉప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స కోసం చేర్పించారు.
ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అత్యవసర పరిస్థితిలో చాకచక్యంగా స్పందించి సురక్షిత ప్రసవం జరిపిన ఉప్పల్ 108 అంబులెన్స్ సిబ్బంది నాగరాజు, ఉపేందర్ల సేవలను కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసించారు. వారి సమయస్ఫూర్తి కారణంగా తల్లీబిడ్డలు సురక్షితంగా ఉండటంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.




