
అంగన్వాడీలకు జీతాల్లేవు.. మహిళలను కోటీశ్వరులను చేస్తారా?
పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి..
-మాజీమంత్రి హరీశ్రావు
రెండు నెలలుగా 62 వేల మంది అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఎలా చెబుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేసి మహిళల పట్ల గౌరవం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అంగన్వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం వారి హోదాను అంగన్వాడీ టీచర్లుగా ఉన్నతీకరించిందని హరీశ్రావు తెలిపారు. 2014లో టీచర్లకు రూ.4,200, సహాయకులకు రూ.2,200 వేతనం ఉండగా, బీఆర్ఎస్ హయాంలో టీచర్ల వేతనం రూ.13,650కు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనం రూ.7,800కు పెంచామని పేర్కొన్నారు.
అభయహస్తం మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.18 వేల వరకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీశ్రావు గుర్తుచేశారు. రెండున్నరేళ్లు గడిచినా చర్యలు లేవని విమర్శించారు. అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలకు ఏడాదిగా బకాయి ఉన్న పెంచిన వేతనాలు, రెండు నెలల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.




