
నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య..?
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చాల్కి గ్రామ శివారులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయం భయంగా ఉంది.. చనిపోతాను అంటూ కూతురితో వీడియో కాల్ మాట్లాడిన అతను.. మంజీరా నదిలో దూకేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఝరాసంగం మండలం కుప్పనగర్కు చెందిన పాపయ్య నారాయణఖేడ్లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య కొంతకాలం క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. అప్పట్నుంచి ఇద్దరు కూతుళ్లతో కలిసి నారాయణఖేడ్లోనే నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం బైక్పై ఇంటి నుంచి వెళ్లిన పాపయ్య మంజీరా నది ఒడ్డునకు చేరుకుని తన కూతురికి వీడియో కాల్ చేశాడు. ‘భయం భయంగా ఉంది. చనిపోతాను.. మీరందరూ బాగుండాలి.’ అని కూతురితో చెప్పి ఫోన్ కట్ చేశాడు.
దీంతో కంగారుపడిపోయిన కుమార్తె కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. అందరూ కలిసి మంజీరా నది ఒడ్డునకు వచ్చి పాపయ్య కోసం వెతికారు. ఈ క్రమంలో మంజీరా నది ఒడ్డున బైక్, సెల్ఫోన్, బట్టలు కనిపించాయి.
దీనిపై పాపయ్య కుటుంబసభ్యులు హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హద్నూర్ పోలీసులు పాపయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గజఈతగాళ్లతో శుక్రవారం రాత్రి వరకు మంజీరా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అతని ఆచూకీ దొరకలేదు. చీకటి పడటంతో సహాయక చర్యలు ఆపేసిన పోలీసులు.. శనివారం తెల్లవారుజామునే గాలింపు చర్యలు చేపట్టారు.



